
ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి అపూర్వస్వాగతం
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబం తమ ఇంట్లో సుమారు 200 ఏళ్ల తర్వాత జన్మించిన ఆడబిడ్డకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. నాలుగు తరాల నిరీక్షణకు తెరదించుతూ పుట్టిన ఆ చిన్నారిని రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకువచ్చి తమ అమితమైన ఆనందాన్ని చాటుకున్నారు.బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో గత రెండు శతాబ్దాలుగా ఆడపిల్లలు జన్మించలేదు. ఇటీవల ఆ కుటుంబంలోకి ఓ పాపాయి అడుగుపెట్టడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్నారికి 'గర్గి' అని నామకరణం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం, తల్లీబిడ్డలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ రథంపై ఊరేగింపుగా ఇంటికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాప నానమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ, "మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది. ఆసుపత్రి నుంచే పాపకు ఘనంగా స్వాగతం పలకాలని అప్పుడే నిర్ణయించుకున్నాం" అని హర్షం వ్యక్తం చేశారు. పాప తాతయ్య కూడా స్పందిస్తూ, ఇది తమ గొప్ప అదృష్టమని, ఇన్నాళ్లుగా తమ వంశంలో ఆడపిల్ల లేదన్న వెలితి తీరిపోయిందని అన్నారు."సాధారణంగా చాలామంది కుమారుడు జన్మించాలని కోరుకుంటారు. కానీ ఆడపిల్ల పుడితే కలిగే అనుభూతే వేరు. తండ్రులకు కూతుళ్లంటే అమితమైన ప్రేమ. మా పాపను కంటికి రెప్పలా చూసుకుంటాం" అని గర్గి తండ్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు